లగచర్ల ఘటన.. 55 మంది అరెస్ట్

  • ఫార్మాసిటీ భూముల కోసం అభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై రైతుల దాడి
  • కర్రలు, రాళ్లు, చెప్పులతో విరుచుకుపడిన గ్రామస్థులు
  • లగచర్లలో భారీ బందోబస్తు.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై దాడి కేసులో 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, దుద్యాల, కొడంగల్, బొంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. లగచర్లలో పోలీసులను మోహరించారు.

ఫార్మాసిటీ ఏర్పాటుకు స్థల సేకరణ కోసం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో నిన్న ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. ఫార్మాసిటీకి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేని గ్రామస్థులు కలెక్టర్ సహా అధికారులపై కర్రలు, రాళ్లతో దాడిచేశారు. ఈ దాడి నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్ తప్పించుకున్నారు. కలెక్టర్, అధికారుల కార్లను రైతులు ధ్వంసం చేశారు.

ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని పట్టుకుని కర్రలు, రాళ్లతో దాడిచేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వారి నుంచి తప్పించుకున్న వెంకట్‌రెడ్డి పొలాల వెంట పరుగులు పెట్టారు. ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిపైనా రైతులు దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో దాడికి పాల్పడిన 55 మందిని గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Lagacharla
Vikarabad District
Kodangal
Pharma City

More Telugu News